బెంగళూరు, మే 13: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైన వేళ సీఎం ఎవరవుతారనే దానిపై ముమ్మర చర్చ నడుస్తున్నది. ఆ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యే పోటీ నెలకొన్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కురబ వర్గానికి చెందిన సిద్ధరామయ్య ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆయన కుమారుడు యతీ్రందతో పాటు సర్వేల్లో చాలామంది సిద్ధరామయ్య సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్కు హస్తం పార్టీలో ‘ట్రబుల్ షూటర్’గా పేరుంది. తాజా గెలుపుతో సహా వరుసగా 8 సార్లు కనకపుర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శివకుమార్ ‘కనకపుర రాక్’గా పేరొందారు. తాజా ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు 74.58 శాతం వచ్చాయి. ఇది ఈ ఎన్నికల్లో రికార్డు మెజార్టీ.పార్టీ జాతీయ అధిష్ఠానంతోనూ, పార్టీ నేషనల్ చీఫ్ ఖర్గేతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆదివారం కాంగ్రెస శాసనసభా పక్షం బెంగళూరులో సమావేశం కానుంది.