న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ముందు నుంచి పేరు వినిపిస్తున్న శశిథరూర్తో పాటు సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు వేశారు. రాజస్థాన్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఊహించినట్టుగానే అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు. సంక్షోభం నేపథ్యంలో అధిష్టానం సూచనలతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలుస్తున్నది. అక్టోబర్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు. 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అప్పటికి ఒకరి కంటే అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికలు అనివార్యం అవుతాయి. అక్టోబర్ 17న ఎన్నికలు, 19న ఫలితాలను ప్రకటిస్తారు.
ఖర్గేకే అధిష్టానం, సీనియర్ల మద్దతు!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం విధేయుడైన మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఈయనకు అంతర్గతంగా సోనియా కుటుంబంతో పాటు పార్టీలోని సీనియర్ల మద్దతుంది. ఆనంద్ వర్మ, మనీశ్ తివారీ, భూపిందర్ హుడాలాంటి జీ-23 నేతలు కూడా ఆయన నామినేషన్ను ప్రతిపాదించడం గమనార్హం. ముగ్గురి నేతల నామినేషన్లలో ఎవరి కార్యక్రమానికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ హాజరుకాలేదు. అయితే అధిష్టానమే మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్రివిధ దళాల నూతన అధిపతిగా నియమితులైన లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత త్రివిధ దళాల అత్యున్నత పదవిని చేపట్టడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అన్ని అంచనాలను అందుకోవటానికి ప్రయత్నిస్తా’ అని వెల్లడించారు.