Congress Politics | కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. పార్టీని నడిపించే గురుతర బాధ్యత ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి నమ్మినబంటు అయిన అశోక్ గెహ్లాట్పై పడనున్నది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. పార్టీలో ప్రతి ఒక్కరికీ ఒకే పదవి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని గెహ్లాట్ అధిష్టిస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలను తప్పుకోవాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ సాగుతున్నది. ఇందులో ప్రధానంగా మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, స్పీకర్ సీపీ జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల పేర్లు సీఎం రేసులోకి రావడం ఇది రెండోసారి. 2008లో జోషి, 2018లో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవి దగ్గరిదాకా వచ్చి దూరమైంది. ఆ తర్వాత పైలట్కు ఉప ముఖ్యమంత్రిని చేశారు. రెండేళ్ల కింద 2020లో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా పైలట్ను ఆ పదవిని నుంచి తొలగించారు.
వాస్తవానికి 2013 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 200 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 21 మంది కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. ఈ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సచిన్ పైలట్ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. రాష్ట్రంలో పార్టీని మరోసారి నిలబెట్టేందుకు పైలట్ శ్రమించారు. 2018 ఎన్నికలకు ముందు పైలట్ దాదాపు ఐదున్నర లక్షల కిలోమీటర్లు తిరిగి.. కార్యకర్తల్లో ఉత్సాహం నిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పైలట్ సీఎం కాలేకపోయారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 100 సీట్లకు ఒక్కస్థానంతో వెనుకపడిపోయింది. అయితే, ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్లో రాజకీయంగా ప్రకంపనలు వచ్చాయి. కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రాకపోవడంతో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవి దూరమయ్యారు. సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లాట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు సాధించడంలో సక్సెస్ కావడంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీ జోషి ముఖ్యమంత్రి కావడం ఖాయమనే చర్చ సాగింది. ఆ సమయంలో రాజస్థాన్లోని కాంగ్రెస్ కీలక నేతల్లో ఆయన ఒకరు. అశోక్ గెహ్లాట్ సైతం ఆయన తర్వాతనే. అప్పట్లో జోషిని రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలనే చర్చ సాగింది. విజయం ఖాయమునుకున్న రాజ్సమంద్ జిల్లాలోని నాథ్ద్వారా నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
గతంలో 1980, 1985, 1998, 2003లో అదే స్థానం నుంచి గెలుపొందారు. ఈ క్రమంలో ఆయన గెలుపు సెలువేననని భావించినా.. ఎవరూ ఊహించని విధంగా ఫలితం వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన భార్య ఓటు వేయలేదు. జోషికి ఆ ఓటు వచ్చి ఉంటే ఆ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారే.. ఈ విషయాన్ని జోషి సైతం ధ్రువీకరించారు. ఓటింగ్ రోజున భార్య, కూతురు గుడికి వెళ్లారని, అందుకే ఓటు వేయలేకపోయారని చెప్పారు.