చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అన్ని పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు బరిలో నిలువబోయే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల పేర్లతో లిస్టును వెల్లడించింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చామ్కౌర్ సాహిబ్ నుంచి పోటీ చేయనున్నారు.
అదేవిధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. సీనియర్ నాయకుడు ప్రతాప్సింగ్ బజ్వా కాడియన్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ప్రముఖ పంజాబీ సింగర్ సిధూ మూసేవాలా మాన్సా స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నటుడు సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు.
కాగా, మొత్తం 117 నియోజకవర్గాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకేరోజు పోలింగ్ జరుగనున్నది. అదేరోజు యూపీలో రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి. పంజాబ్తోపాటు యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.