న్యూఢిల్లీ: మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు బీఎస్పీ చీఫ్ మాయావతి(BSP Chief Mayawati) ఆరోపించారు. కులతత్వ, ధనిక పార్టీలతో జత కట్టి ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె విమర్శించారు. బీజేపీ కూడా ఎన్డీఏను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని, కానీ ఆ రెండు పార్టీలు.. దళిత, ముస్లిం వ్యతిరేకమని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు. దేశంలోని విపక్ష పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాయావతి స్పందించారు.
బీజేపీ కానీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం వాళ్లేమీ చేయలేదన్నారు. ఆ పార్టీలన్నీ ఒక్కటే అని, అధికారంలోకి రాగానే, వాళ్లు వాగ్ధానాలను మరిచిపోతారని మాయావతి ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ప్రామిస్ను కూడా వాళ్లు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ అయినా లేక బీజేపీ అయినా.. రెండూ ఒక్కటే అన్నారు. అందుకే విపక్ష పార్టీలతో చేయి కలపలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు.