Congress Party | దేశంతోపాటు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు `హస్తం` పార్టీ వైపు మొగ్గు చూపారు. వారిలో గతంలో బీఆర్ఎస్ తరఫున గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేశ్ నేత ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వెంకటేశ్ నేత, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరి విజయం సాధించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నేత జీ వెంకటస్వామి తనయులు వివేక్ వెంకట స్వామి, వినోద్ వెంకట స్వామి విజయం సాధించడంతో పెద్దపల్లి ఎంపీ సీట్పై హామీతో వెంకటేశ్ నేత.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. అలాగే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సికింద్రాబాద్ లోక్సభ సీటుపై కన్నేశారని, ఆయనకు కూడా కాంగ్రెస్ అధి నాయకత్వం హామీ ఇచ్చారని తెలుస్తున్నది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్ ఇటీవలే హస్తం పార్టీలో చేరారు. ఆయనతోపాటు చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గురువారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన ఐదు స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, పెద్దపల్లి (ఎస్సీ) స్థానం నుంచి గడ్డం వంశీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. దీంతో బొంతు రామ్మోహన్, బోరకుంట వెంకటేశ్ నేతలకు కాంగ్రెస్ పార్టీ రిక్తహస్తం చూపినట్లయింది.