న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ చతికిలబడింది. పంజాబ్లో అయితే అధికారాన్ని కోల్పోవడమేగాక గౌరప్రదమైన స్థానాలు దక్కే అవకాశం కూడా లేదు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కెప్టెన్ అమరీందర్సింగ్కు పొగబెట్టడం ద్వారా అక్కడ పార్టీ కొంపముంచాడని విశ్లేషకులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకుగాను 77 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి డజను స్థానాలు గెలువడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. యూపీలోనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆ డిజిట్ను కూడా చేరుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్ తేటతెల్లమయ్యేసరికి అక్కడ కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉన్నది. ఆ నాలుగు స్థానాల లీడింగ్ కూడా చివరిదాకా కొనసాగుతుందన్న నమ్మకం లేదు.
ఇక మణిపూర్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. మొత్తం 60 స్థానాలకుగాను గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కూటమి ఇప్పుడు డబుల్ డిజిట్ కోసం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పార్టీ కేవలం 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. గోవాలోనూ గత ఎన్నికల్లో 20 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కూటమి.. ఇప్పుడు లీడింగ్స్ను బట్టి చూస్తే 15 స్థానాల్లో కూడా గెలిచేలా లేదు. కేవలం ఉత్తరాఖండ్లో మాత్రమే కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. గతం కంటే 10 స్థానాలు అదనంగా గెలువబోతున్నది.