న్యూఢిల్లీ : కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సంఘ్ పరివార్ కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని మణిశంకర్ అయ్యర్ గుర్తుచేశారు.
దేశాన్ని చీల్చేవారి కుయుక్తులకు వ్యతిరేకంగా మనమంతా పోరాడాలని అన్నారు. ముందుగా మనం భారత్లో ఐక్యతను తీసుకురావాలని ఆపై ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని ఓ వార్తా ఛానెల్తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలన్నీ కలిసివస్తే ప్రధాని నరేంద్ర మోదీకి దీటైన సవాల్ విసరగలమని స్పష్టం చేశారు.
తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ యాత్రలో భద్రతా లోపంపై కాంగ్రెస్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జోడో యాత్రలో పాల్గొనే నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరింది.