కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి నేతలకు ఓ టాస్క్ అప్పజెప్పారు. పార్టీలో కౌరవ పాత్ర పోషించే నేతల జాబితాను వెంటనే తయారు చేసి, వారిని గుర్తించాలని రాహుల్ ఆదేశించారు. పార్టీలోని కౌరవుల జాబితాను వెంటనే తయారు చేయండి. ప్రజల్లోకి వెళ్లకుండా, కేవలం పార్టీ కార్యాలయంలో ఏసీలో హాయిగా కూర్చుని వుండే వారి పేర్లు, వారు పనిచేయరు.. పని చేసే నేతలను చెడగొట్టే నేతల జాబితాను వెంటనే రూపొందించండి. అంటూ రాహుల్ గాంధీ నేతలను ఆదేశించారు.
కాంగ్రెస్లో పనిచేయకుండా.. కేవలం ఏసీలో కూర్చునే వారందరూ బీజేపీలో చేరిపోతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. విపక్ష నేతలందరిపైకీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని, చివరికి న్యాయమే గెలుస్తుందని, అసలు విషయం బయటపడుతుందన్నారు. బీజేపీ రాజకీయాల వల్లే గుజరాత్ ఇలా తయారైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ తరపున ప్రజలకు ఏం చేయదలిచామో.. చెప్పే విసయంలో మాత్రం పార్టీ విఫలమైందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఆశతో ఎదిరి చూస్తున్నారని, కష్టపడి పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు.