Tamil Nadu : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, డీఎంకే ఇప్పుడు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. టీవీకేతో పొత్తు కోసం డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీపై డీఎంకే నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల్ని ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు ఈ అంశంలో కాంగ్రెస్ వంతు వచ్చింది.
ఏఐఏడీఎంకేతో పొత్తు అవకాశాన్ని డీఎంకే పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. గడువులోగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు పార్టీలు ఇప్పటికే వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. స్టాలిన్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. అందుకే ఇప్పుడు స్టాలిన్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎవరు వెన్నుపోటుదారులు అంటూ ప్రశ్నిస్తోంది. బద్ధ శతృవులైన ఏఐఏడీఎంకేతో డీఎంకే కలవాలి అనుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
స్టాలిన్పై మండిపడ్డారు. ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఎప్పటికీ బద్ధ శతృవులైన రెండు ద్రవిడ పార్టీలు ఒక్క రాత్రిలో ఒక్కటైపోయాయి. అదీ తమిళనాడు కోసం కాదు. విజయ్ అనే ఒక వ్యక్తిని అడ్డుకోవడం కోసం. ఇది గమనించిన కాంగ్రెస్ అందుకే కూటమి నుంచి బయటకు వచ్చింది. లౌకిక పార్టీగా చెప్పుకొంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ బీ–టీమ్గా చెప్పే పార్టీలతో కలవకూడదు. స్థిరమైన ప్రభుత్వం కోసం అంటూ చెప్పుకోవడం కేవలం రాజకీయంగా తమ పదవుల్ని కాపాడుకోవడం కోసమే.
కాంగ్రెస్కు కూటమి నుంచి బయటకు వచ్చే హక్కు ఉంది. ఇప్పుడు ఎవరు కుట్రదారులు..?” అంటూ మాణిక్యం ఠాగూర్ ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో విజయ్ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి మద్దతు ఇస్తోంది. ఆ పార్టీతో కలిసి కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది.