మేం కుండలు తయారు చేసుకుంటాం. అందుకు సంబంధించి మాకు ఏమైనా సాయం చేయండి సార్ అని నన్ను ఒకరు అడిగారు. ఇప్పుడైతే వీలు కాదు.. ఎందుకంటే ప్రస్తుతం మనం 5 గ్యారెంటీ పథకాలను నడిపిస్తున్నాం.. బడ్జెట్ అంతా దానికే సరిపోతున్నది. ఈ ఐదు హామీలు మనల్ని ఇతర అభివృద్ధి పనులు చేయకుండా పడుకోబెట్టాయని చెప్పాను. వచ్చే బడ్జెట్లో చూద్దామని అన్నాను.
-కర్ణాటకలోని తిప్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కే షడాక్షరి
Karnataka | హైదరాబాద్, అక్టోబర్ 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘నింగిలో మొగులు చూసుకొని నిండుకుండ ఒలకబోసుకొన్నట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నరకాన్ని పరిచయం చేస్తున్నది. అలవికాని ‘5 గ్యారెంటీ’ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. తమ కొత్త గ్యారెంటీ పథకాలను అమలుచేసేందుకు అప్పటికే ఉన్న పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. అయినా నిధులు సరిపోక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతున్నది. సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 5 గ్యారెంటీ పథకాలపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ పథకాలవల్ల ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయని అంటున్నారు. నియోజకవర్గాలకు వెళ్తే పాత పథకాలను ఎందుకు ఆపారని ప్రజ లు నిలదీస్తున్నారని, ముందూ వెనుకా ఆలోచించకుండా ఇచ్చిన హామీలతో పరిస్థితులు అల్లకల్లోలం గా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిండుకున్న ఖజానా
ఐదు పథకాలను అమలుచేయాలని ఒకవైపు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కాంగ్రెస్ సర్కారు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవటంతో అప్పటికే కొనసాగుతున్న పథకాలను క్రమంగా అటకెక్కించటం మొదలుపెట్టింది. అయినా, నిధులు సరిపోవని అర్థం కావటంతో దాదాపు అన్నిరంగాలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది. ఇంతచేసి కొత్త పథకాలనైనా సంపూర్ణంగా అమలుచేస్తున్నదా అంటే అదీలేదు. అధికారం చేపట్టగానే అన్నభాగ్య పథకం ప్రారంభిస్తున్నామని హడావిడి చేసింది. అంతలోనే బియ్యం దొరకటంలేదని, కేంద్రం బియ్యం ఇవ్వటంలేదని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఆ పథకాన్ని దాదాపు గంగలో కలిపేసింది.
బియ్యానికి బదులు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. కానీ, అందులో ఓ మెలికపెట్టింది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన బియ్యానికి కిలోకు ఎంత ధర ఉండేదో అంతే ఇస్తామని చెప్పింది. దీంతో ప్రజలు ఖంగుతిన్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో రెండు కిలోల బియ్యం కూడా రావు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ డబ్బులైనా సరిగ్గా ఇస్తున్నదా అంటే అదీలేదు. శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో కర్ణాటక ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. డీజిల్కు కూడా డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపటమే నిలిపేశారని వార్తలు వస్తున్నాయి. బస్సులే లేనప్పుడు ఈ పథకం ఉంటే ఏంత? లేకుంటే ఎంత అని మహిళలు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పథకంవల్ల తమ వృత్తులు దివాళా తీశాయని, తినటానికి తిండి కూడా దొరకటం లేదని ఆటో, ప్రైవేటు వాహనాల యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. ఇక, మిగతా పథకాల అమలుతో ఖజానా పూర్తిగా దివాళా తీసింది.
ఆగ్రహావేశాలు
కర్ణాటక ప్రభుత్వ తీరుపై ప్రజలతోపాటు సొంత పార్టీ నేతల్లోనే ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల గురించి ప్రజలు అడుగుతున్నారు. దీంతో వారంతా వెళ్లి ఇటీవల సీఎం సిద్ధరామయ్యకు మొరపెట్టుకొన్నారు. ఖజానాలో డబ్బులేదని, ఐదు గ్యారెంటీలు తప్ప ఇప్పటికిప్పుడు ఇతర పనులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేమని సీఎం చేతులెత్తేశారని సమాచారం. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 5 గ్యారెంటీలు తమ కొంప ముంచాయని తిప్తూరు ఎమ్మెల్యే శడాక్షరి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎవరు ఏ సాయం అడిగినా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు, బెంచీలు ఏర్పాటుచేయటానికి డబ్బు అడిగినా సీఎం స్పందించలేదని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ అయితే సొంత ప్రభుత్వంపైనే శాపనార్థాలు పెట్టారు. 5 గ్యారెంటీల వల్ల ఖజానా ఖాళీ అయ్యిందని, ఈ పథకాలు అవసరమా? అని ప్రశ్నించారు. పథకాల అమలుకోసం తమ ప్రభుత్వం పేదల నుంచి మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు గుంజుతున్నదని ఆరోపించారు. వీరేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. ఏది అడిగినా ‘ఇప్పుడు కాదు.. వచే ఏడాది బడ్జెట్లో చూద్దాం’ అని దాటవేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మోయలేని భారం
అధికారం పరమావధిగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. గృహలక్ష్మి (కుటుంబంలో ప్రతి మహిళా పెద్దకు నెలకు రూ.2000), గృహజ్యోతి (ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు), యువనిధి (డిగ్రీ పాసైన యువతకు నెలకు రూ.3000 భృతి, డిప్లొమా ఉన్నవారికి నెలకు రూ.1500), అన్నభాగ్య (ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం), శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం) పథకాలను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్థమైంది అసలు కథ. ఈ 5 పథకాలను అమలుచేయాలంటే ఏటా ఏకంగా రూ.52 వేలకోట్లు అవసరమని స్వయంగా సిద్ధరామయ్యే ప్రకటించారు. ఇక అక్కడ మొదలైంది నాటకం.