అసోం ప్రభుత్వంపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే తనను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. వచ్చే యేడాదిలో ఎన్నికలు ఉన్నాయని, అందుకే తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అరస్ట్ చేశారని పేర్కొన్నారు.
పీఎంవో కేంద్రంగానే తన అరెస్ట్కు కుట్ర జరిగిందని మేవానీ ఆరోపించారు. పీఎంవోలో ఉన్న గాడ్సే సానుభూతిపరులు తాను చేసిన ట్వీట్లను వ్యతిరేకిస్తూ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. కానీ.. దేశంలో ఇంత కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నవారే వున్నారు. కానీ.. ఈ ట్వీట్ పై కేసు నమోదు చేయడం అంటే ప్రభుత్వ ఉద్దేశ్యమేమిటో తెలిసిపోతోంది అంటూ మేవానీ విరుచుకుపడ్డారు.
అసోం ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఆ వ్యాఖ్యలను విని, ప్రభుత్వం సిగ్గుపడాలని మేవానీ ఫైర్ అయ్యారు. తనపై ఏప్రిల్ 19 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అదే రోజు పోలీసులు 2,500 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి తనను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. దీనిని బట్టే ఇదో ముందస్తు కుట్రలో భాగమని తేలిపోతోందని మేవానీ పేర్కొన్నారు.