Karnataka Congress | కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించి సరిగ్గా ఆరు నెలలు. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని రాష్ట్ర ప్రజలు అప్పుడే చింతిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సీఎం సీటు లొల్లి అటుంచితే.. రాష్ట్రంలో తీవ్రమైన కరెంట్, నీటి సంక్షోభం నెలకొన్నది. సిద్ధరామయ్య సర్కార్పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన ఐదు గ్యారెంటీల అమలులోనూ కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ‘అట్లుంటది కాంగ్రెస్ తోని..!’ అనేలా ప్రస్తుతం కర్ణాటక ప్రజల పరిస్థితి ఉన్నదనే విశ్లేషణలు వస్తున్నాయి.
బెంగళూరు, నవంబర్ 20: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కార్గా పేరుపొందిన బీజేపీని గద్దె దింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. ఆర్నెల్లు కాకుండానే రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో పెద్దయెత్తున అవినీతి కంపు కొడుతున్నది. కాంట్రాక్టులు, అధికారుల బదిలీల్లో కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం సీటు కోసం కొనసాగుతున్న నేతలు సిగపట్ల వ్యవహారం ఎలాగూ ఉండనే ఉన్నది. ఓవైపు కరెంట్ లేక తాగేందుకు నీరు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే.. తమకు ఇవేమీ పట్టవన్నట్టుగా హస్తం పార్టీ నేతల తీరు కనిపిస్తున్నది.
నెలకు 50 మంది రైతుల బలవన్మరణాలు
సాగు కోసం నాణ్యమైన కరెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులను నిండా ముంచింది. సరిపడా విద్యుత్తు సరఫరా లేక, ఉన్న కరెంట్ కూడా పదేపదే కోతలతో వస్తుండటంతో అన్నదాతలు నానాకష్టాలు పడుతున్నారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలు, అప్పుల బాధలు తట్టుకోలేక వందలాది మంది రైతులు ఆత్యహత్యలు చేసుకొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్నెల్లలో దాదాపు 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కోతల్లేకుండా సరిపడా విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో రైతులు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ‘కమీషన్రాజ్’
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు ‘కమీషన్రాజ్’గా పేరొచ్చింది. కాంట్రాక్టర్లు, బదిలీల్లో కమీషన్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక ఖర్గేపై అరోపణలు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులు విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమను 10-15 శాతం కమీషన్ అడుగుతున్నారంటూ బృహత్ బెంగళూర్ మహానగర పాలిక కాంట్రాక్టర్ల సంఘం గతంలో సంచలన ఆరోపణలు చేసింది.
మంత్రి ప్రియాంక్ ఖర్గే పరిధిలోని కియోనిక్స్లో కమీషన్ల దందా ఆకాశాన్ని తాకింది. బిల్లుల క్లియరెన్స్ కోసం ఎండీ 10-12 శాతం లంచం డిమాండ్ చేస్తున్నారని కియోనిక్స్ పరిధిలో పనిచేసే చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ‘క్యాష్ ఫర్ పోస్టింగ్స్(పోస్టింగ్, బదిలీలకు ముడుపులు)’ స్కామ్ దుమారం రేపుతున్నది. అధికారుల పోస్టింగ్లు, బదిలీలకు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర భారీయెత్తున వసూళ్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీఎం కుర్చీలాటతో నిత్యం అస్థిరత
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిరంతరం అస్థిరతగా కొనసాగుతున్నది. ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారా? ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా? అనేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా కాంగ్రెస్లో సీఎం సీటు లొల్లి కొనసాగుతూనే ఉన్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే, వారి వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. వీరితోపాటుగా సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి వంటి మరికొంత మంది నేతలు కూడా సీఎం రేసులోకి వస్తున్నారు.
ఐదు గ్యారెంటీలకు గ్రహణం
కర్ణాటకలో గద్దెనెక్కేందుకు ఐదు గ్యారెంటీల పేరుతో మాయ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీల అమలులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. సర్కారు సవాలక్ష కొర్రీలతో పేదలకు చుక్కలు చూపిస్తున్నది. 200 యూనిట్ల వరకు ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్.. ఉచితం మాట అటుంచి ఎడాపెడా విద్యుత్తు కోతలు పెడుతున్నది. బియ్యం దొరకడం లేదంటూ ‘అన్నభాగ్య’ స్కీమ్ అమలులో చేతులేత్తేసింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఆర్భాటంగా ‘శక్తి’ స్కీమ్ను ప్రారంభించి.. ఇప్పుడు ఆర్థిక భారం పేరుతో అనేక మార్గాల్లో సర్వీసులు రద్దు చేసింది. నిరుద్యోగ భృతికి సంబంధించిన ‘యువ నిధి’ అయితే అతీగతీ లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారు.