న్యూఢిల్లీ : చండీఘఢ్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వెలుపల నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం కాంగ్రెస్ నేతలను సెక్టార్ 3 పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరుపై భగవంత్ మాన్ విస్మయం వ్యక్తం చేశారు. ముడుపుల కేసులను ఎదుర్కొంటున్న తమ నేతలకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు తన నివాసం వద్ద నిరసన చేపట్టారని, పంజాబ్ను దోచుకుతిన్న వారికి వత్తాసు పలుకుతూ తమ రక్తంలోనే అవినీతి ఉందని వెల్లడించారని మాన్ ఎద్దేవా చేశారు.
అవినీతి కాంగ్రెస్ నేతల హక్కుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సాధు సింగ్ ధరమ్సోత్ అరెస్ట్ వ్యవహారంపై మాట్లాడేందుకు తమకు అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం ఆపై తమతో భేటీకి నిరాకరించారని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ బ్యూరో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ను అరెస్ట్ చేసింది. దళిత స్కాలర్షిప్ స్కీముల్లో కోట్లాది రూపాయల స్కామ్కు ప్రధాన సూత్రధారిగా సాధుసింగ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి.