హలాల్ విషయం కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనేక హిందూ సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక పీసీసీ ఘాటుగా స్పందించింది. హిందుత్వ సంఘాలకు నిజంగా దేశ భక్తి ఉంటే.. హలాల్ వ్యాపారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులను ఆపి, తమ దేశభక్తిని నిరూపించుకోవాలని కర్నాటక పీసీసీ అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి నేతృత్వంలో చాలా మంది బీజేపీ నేతలు హలాల్ మాంసానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హలాల్ వ్యాపారంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార సంస్థల పూర్తి వివరాలు తాము బీజేపీ నేతలకు, హిందుత్వ సంఘాలకు ఇస్తామని, అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేసే సంస్థల వివరాలు కూడా ఇస్తామని ఖర్గే అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే.. ఆ కంపెనీలు హలాల్ వ్యాపారం చేయకుండా అడ్డుకోవాలని, దేశ భక్తిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రాందేవ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్, ఓఎమ్ ఇండస్ట్రీస్, ఐటీసీ లిమిటెడ్, డాబర్ ఇంఇయా లిమిటెడ్, క్రిష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్స్యుమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, అమూల్ ఫెడ్ డెయిరీ లాంటి కంపెనీలకు హలాల్ ఫౌండేషన్ హలాల్ సర్టిఫికెట్లను ఇచ్చిందని ఖర్గే వెల్లడించారు. ఈ కంపెనీలను బీజేపీ, హిందుత్వ సంఘాలు వెంటనే అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంక్ డిమాండ్ చేశారు. ఎలాంటి పన్నులు, ఆంక్షలు లేకుండా.. ఇండియన్ హలాల్ను ఎగుమతి చేసుకోవాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ కోరారని, మరి దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఇది వంచన కాదా? అని ప్రియాంక్ ఖర్గే నిలదీశారు.