లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై విమర్శల దాడిని తీవ్రతరం చేస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. యూపీలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని దుయ్యబట్టారు. గత ఐదేండ్లలో రాష్ట్రంలో 16.5 లక్షల మంది యువత తమ ఉద్యోగాలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
4 కోట్ల మంది తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశను కూడా వదులుకున్న దౌర్భాగ్య పరిస్థితులు యూపీలో నెలకొన్నాయని అన్నారు. నిరుద్యోగ సమస్యపై యోగి ఆదిత్యానాధ్ మాత్రం నోరుమెదపడం లేదని, ఈ అంశంపై ట్వీట్లు కూడా చేయరని ఆమె మండిపడ్డారు. ఉపాధి అవకాశాల గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం బయటపడుతుందని కాషాయ పాలకులు భయపడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ సారధ్యంలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుండగా పాలక బీజేపీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కూడా మెరుగైన ఫలితాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7 నుంచి ఏడు దశల్లో జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.