ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్లో గాంధీ కుటుంబంపై విమర్శలు పెరిగాయి. గాంధీ పరివారం పక్కకు తప్పుకోవాల్సిందేనని జీ23 గ్రూపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ఐదు రాష్ట్రాల ఘోర ఓటమికి ఒక్క గాంధీ కుటుంబాన్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం తప్పని స్పష్టం చేశారు.
బాధ్యత నుంచి ఎవ్వరూ పారిపోవడం లేదని, ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తున్నామని గాంధీ కుటుంబం ప్రకటించిందని అన్నారు. గోవా ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని, మిగతా రాష్ట్రాల ఓటమికి కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యులు బాధ్యత వహిస్తున్నారని చిదంబరం తెలిపారు. జీ 23 నేతలు తమ మాటల వల్ల పార్టీని చీల్చవద్దని విజ్ఞప్తి చేశారు.
‘బాధ్యతల నుంచి ఎవ్వరూ పారిపోవడం లేదు. బ్లాక్ స్థాయి నుంచి మొదలు పెడితే… ఉన్నత స్థాయి వరకూ ఓటమికి అందరి బాధ్యతా వుంటుంది. ఒక్క ఏఐసీసీ నేతల్నే బాధ్యత వహించాలని డిమాండ్ చేయడం సరైనది కాదు’ అంటూ చిదంబరం పేర్కొన్నారు.