(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకొంటున్న విధానాలపై సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నది. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే కులగణన డిమాండ్పై కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కులగణన’ దివ్యౌషధం కాదని, సమాజంలో నెలకొన్న నిరుద్యోగం, అసమానతలను ఇది తొలగించబోదని పేర్కొన్నారు. కులగణనపై కాంగ్రెస్ తాజాగా తీసుకొన్న నిర్ణయం.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విధానాలకు విరుద్ధంగా ఉన్నదని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు.
‘కులాలు చూసి కాదు.. చెయ్యి గుర్తు చూసి ఓటేయండి’ అని 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల్లో నినదించారు. ఎన్నికల్లో కులతత్వాన్ని ఓ అంశంగా మారిస్తే, సమస్యలు వస్తాయంటూ 1990లో రాజీవ్గాంధీ సైతం దీన్ని వ్యతిరేకించారు. అలాంటిది కులగణన పేరిట మనం ఇప్పుడు వారి ఆదర్శాల నుంచి దూరం జరగడం ఆందోళన కలిగిస్తున్నది’ అని శర్మ లేఖలో పేర్కొన్నారు.