ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపైనే అన్ని పార్టీలూ కన్నేశాయి. వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ గెలిచే ఛాన్స్ ఉంది? అత్యధిక స్థానాలు ఎక్కడ సంపాదించుకునే అవకాశాలున్నాయి? అన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. దీంతో పాటు ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులు పార్టీని వీడకుండా చూసుకోవడం ఎలా? అన్న దానిపై పార్టీ సుదీర్ఘమైన వ్యూహాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.
కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గోడ దూకకుండా కాపాడుకోవడం ఎలా? అన్న దానిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దృష్టి సారించింది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ప్రాంతాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు ఘటికులను రాహుల్ ఎంపిక చేసి, వారిని ఈ ప్రాంతాలకు పంపించేశారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, పొత్తుల విషయాలపై కూడా అధ్యయనం చేసే బాధ్యత రాహుల్ వీరికి అప్పజెప్పారు.
ముఖ్యంగా కాంగ్రెస్ గోవాపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గోవాలో బీజేపీ పాతుకుపోయేలా చేసిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ కన్నుమూసిన తర్వాత జరిగిన మొట్ట మొదటి అసెంబ్లీ ఎన్నికలు. పర్రీకర్ లాంటి ఘటికుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో లేరు. దీంతో యాక్టివ్ కావాలని, ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం అవకాశం చిక్కినా… వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహకర్తలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని రాహుల్ సన్నిహితులు అంటున్నారు. 2017 లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అయినా.. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విఫలమైంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఇప్పుడు తలచుకుంటోంది. ఆ తప్పులు ఇప్పుడు చేయవద్దని గట్టిగా నిర్ణయించుకుంది.