Jal jeevan Mission | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయిన ‘జల్ జీవన్ మిషన్’లో రూ.13 వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ కుంభకోణంలో పాలుపంచుకొన్న లెఫ్టినెంట్ గవర్నర్, పలు ఇతర అధికారులపై చర్యలు తీసుకోకుండా కాపాడుతూ.. కుంభకోణాన్ని బయటపెట్టిన ఓ ఐఏఎస్ అధికారిని వేధింపులకు గురిచేస్తున్నదని పేర్కొన్నది. ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ జల్జీవన్ మిషన్లో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ అశోక్ కుమార్ పర్మార్ అనే దళిత ఐఏఎస్ అధికారి ఎల్జీ మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా కేంద్రానికి జీ20 సదస్సును నిర్వహిస్తున్న సమయంలోనే ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
అయితే మోదీ సర్కార్ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలు.. స్కామ్ ఫిర్యాదులో అశోక్ కుమార్ పర్మార్ పేర్కొన్న అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారని, అయితే కుంభకోణాన్ని బయటపెట్టిన పర్మార్ను శిక్షించారని పేర్కొన్నారు. పర్మార్కు 30 ఏండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ, ఆయన్ను జల్శక్తి శాఖ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఏఆర్ఐ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కు హోదా తగ్గించారని అన్నారు. పర్మార్ను నాలుగుసార్లు బదిలీ చేసిన కేంద్రం.. స్కామ్లో పేర్లు ఉన్న అధికారులను మాత్రం రక్షిస్తున్నదని పవన్ ఖేరా ఆరోపించారు. వేల కోట్ల స్కామ్ను బయటపెట్టిన దళిత ఐఏఎస్ అధికారి పర్మార్ను టార్గెట్గా చేసుకొని, ఎందుకు వేధిస్తున్నారో ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక ప్రధాన సూత్రధారి ఎవరున్నారో నిగ్గు తేల్చేందుకు సీబీఐ చేత విచారణ చేయించాలని అన్నారు.