బెంగళూరు, అక్టోబర్ 22: కర్ణాటకలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్తు కొరత సృష్టిస్తున్నదని ఆరోపించారు. ప్రైవేట్ విద్యుత్తు సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయడం ద్వారా ఆ సంస్థల నుంచి భారీగా కమీషన్లు దండుకొని, ఆ సొమ్మును రానున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కోసం తమ పార్టీ అధిష్ఠానానికి ఫండింగ్ చేసేందుకు సిద్ధరామయ్య సర్కారు ఇలా చేస్త్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారస్వామి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు వనరుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి పుష్కలమైన అవకాశం ఉన్నప్పటికీ, కృత్రిక కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.
కమీషన్ల వసూలుకు అధిష్ఠానం ఒత్తిడి
‘విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జి దగ్గర డబ్బుకు కొరత లేదు. అయితే కమీషన్లు వసూలు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనపై ఒత్తిడి చేస్తుండచ్చేమో! విదేశాల నుంచి బొగ్గు కొనుగోలును ఆయన ప్రకటించారు’ అని కుమారస్వామి అన్నారు. ‘పథకాల ద్వారా డబ్బును లూటీ చేసేందుకు అవసరమైన వాతావరణం ఏ విధంగా సృష్టించాలో కాంగ్రెస్ సర్కార్కు బాగా తెలుసు. విదేశాల నుంచి అధిక ధరలకు బొగ్గును దిగుమతి చేసుకొనేందుకు ప్లాన్ చేస్తున్నది’ అని ఆరోపించారు.
రాష్ట్రంలో 15 మెగావాట్ల విద్యుత్తు కొరత ఎదుర్కొంటున్నదని, విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సిద్ధరామయ్య చెప్పారని, అయితే ప్రభుత్వం గత ఐదు నెలలుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని, సంక్షోభానికి ప్రభుత్వ చర్యలే కారణమని విమర్శించారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించడంపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోమ్ తగలబడుతుంటే నీరో వయోలిన్ వాయించాడట! ఇక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కర్ణాటక నీరో(సీఎం) క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు’ అని ఆయన విమర్శించారు.
సామర్థ్యం ఉన్నా కావాలనే..
రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన గణాంకాలను కుమారస్వామి ఈ సందర్భంగా వివరించారు. 3,906.6 మెగావాట్ల హైడ్రో పవర్, థర్మల్ ప్లాంట్ల నుంచి 5,020 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉన్నదని, ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి 2,050 మెగావాట్లు వస్తుందని, పునరుత్పాదక వనరుల నుంచి 17,848.74 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,877.56 మెగావాట్ల విద్యుత్తు వస్తుందని పేర్కొన్నారు. కుమారస్వామి ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తాము ఆయన వ్యాఖ్యలను పట్టించుకోమని అన్నారు. రైతులపై వారికి శ్రద్ధ ఉంటే అధికారంలో ఉన్న సమయంలో ఏమైనా చేసే వారని పేర్కొన్నారు.