బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి మార్టీ మార్చారు. ఇన్నాళ్లు తాను పనిచేసిన బీజేపీ (BJP) ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను సొంత నియోజకవర్గమైన హుబ్బళ్లి-ధార్వాడ (Hubbali-Dharwad) నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress party) బరిలోకి దించింది. ఆయనపై బీజేపీ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగినకై (Mahesh Tenginakai ) పోటీచేయనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 189 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. అయితే ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ పేరు అందులో లేదు. దీంతో షాక్ గురైన ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. తనకు టికెట్ కేటాయించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే గత వారం 23 మంది పేర్లతో విడుదల చేసిన రెండో లిస్ట్లోని ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఆయనకు కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్కి టెకెట్ కేటాయించింది. దీంతో ఆయన గత ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనకు టికెట్ రాకుండా ఉండటానికి బీఎల్ సంతోష్ ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నడ రాష్ట్రంలో వచ్చే నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13న ఫలితాలు వెలువడుతాయి.
లింగాయత్ సామాజకవర్గానికి చెందిన జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవదికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో వారు బీజేపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరు లింగాయత్ సామాజికవర్గంలో బలమైన నాయకులు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే. పైగా వివాదరహితుడు. అయినా కూడా కారణం చెప్పకుండా బీజేపీ టికెట్ నిరాకరించింది. లక్ష్మణ్ సవది కూడా బలమైన నేత. డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వీరిద్దరిని బీజేపీ పక్కనపెట్టడం వల్ల ఆ పార్టీ పట్ల లింగాయత్ ప్రజల్లో అసంతృప్తి మొదలైనట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ దీనిని తెలివిగా అందిపుచ్చుకున్నది. ‘లింగాయత్లకు బీజేపీ అవమానం’ అంటూ కొత్త ప్రచారాన్ని బలంగా మొదలుపెట్టింది.