డెహ్రాడూన్ : మార్చి 10న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాలకు తెరలేస్తుందనే అంచనాల నడుమ ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సిద్ధమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ను రంగంలోకి దించడంతో పాటు ఎమ్మెల్యేల కోసం హెలికాఫ్టర్లను సిద్ధం చేసింది. ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన పార్టీ అభ్యర్ధి ఏ ఒక్కరూ ప్రత్యర్ధి శిబిరంలోకి వెళ్లకుండా నిరోధించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భూపేష్ బాఘేల్కు కట్టబెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్ధులంతా డెహ్రాడూన్ తిరిగిరావాలని పార్టీ ఆదేశించింది.
ఎన్నికల ఫలితాల నేపధ్యంలో గెలుపొందిన అభ్యర్ధులను డెహ్రాడూన్ తరలించేందుకు హెలికాఫ్టర్లను రంగంలో దించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. మార్చి 10న ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే పార్టీ ఎమ్మెల్యేలను బాఘేల్ రాయ్పూర్కు తరలించేందుకు చార్టర్డ్ విమానాన్ని కాంగ్రెస్ సిద్ధం చేసింది. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విస్పష్ట ఆధిక్యం సాధించి మళ్లీ పాలనా పగ్గాలు చేపడతామని కాషాయ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.