సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ తదుపరి సీఎంపై ఉత్కంఠ కొనసాగుతుండగా కీలక పదవిపై కాంగ్రెస్ నేతల్లో కీచులాటలు ఊపందుకున్నాయి. సీఎం రేసులో ముగ్గురు నేతలు పోటీపడుతున్న క్రమంలో సీఎల్పీ నేత ఎంపిక పరిశీలకులకు తలనొప్పిగా మారింది.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ సీఎం పదవిపై ఆశలు పెట్టుకోగా, సీఎల్పీ మాజీ నేత ముఖేష్ అగ్నిహోత్రి, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు సైతం రేసులో నిలిచారు. ఎవరికి వారు తమకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని తమ పేర్లను అత్యున్నత పదవికి పరిగణనలోకి తీసుకోవాలని పరిశీలకులను కోరుతున్నారు.
మరోవైపు సిమ్లాలోని ఒబెరాయ్ సిసిల్ హోటల్ వెలుపల ప్రతిభా సింగ్ మద్దతుదారులు పార్టీ పరిశీలకుడిగా వచ్చిన చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. బఘేల్ కారును చుట్టుముట్టిన కార్యకర్తలు ప్రతిభా సింగ్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఎంపీ ప్రతిభా సింగ్ హిమాచల్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారని ఆమె మద్దతుదారులు గుర్తుచేస్తున్నారు. ఇక 68 స్ధానాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ 40 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ కేవలం 25 స్ధానాలకు పరిమితం కాగా, స్వతంత్రులు మూడు స్ధానాల్లో విజయం సాధించారు.