సూరత్, మే 6: గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను బలపరచినవారిపై ఆ పార్టీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభనిని బలపరుస్తూ ముగ్గురు వ్యక్తులు ఆయన నామినేషన్పై సంతకాలు చేశారు. అయితే ఆ సంతకాలు తమవి కాదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని వీరు ఆరోపించడంతో నీలేష్ నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సూరత్ కాంగ్రెస్ లీగల్ సెల్ సోమవారం సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌత్కు ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సౌరభ్ పర్ధిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, మిగిలిన అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.