Mallikarjun Kharge : వర్ణ వ్యవస్ధను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్పై దుమారం రేగుతోంది. దేశంలోని ఓ రాష్ట్ర సీఎం ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆ సీఎం ప్రస్తుతం బీజేపీ పంచన చేరారని, ఆయన పేరును కూడా తాను ప్రస్తావించనని ఖర్గే చెబుతూ శర్మ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
వ్యవసాయం, వ్యాపారం వైశ్యుల సహజ కర్తవ్యాలని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేసే విధి శూద్రులదని బీజేపీ సీఎం రాసుకొచ్చారు. ఈ పోస్ట్ను తర్వాత డిలీట్ చేశారు. ఓ సీఎం ఇలా మాట్లాడతారా..ఇలాంటి ఆలోచనలు కలిగిన ఆయన పేదల కోసం ఏం పనిచేస్తారని ఖర్గే నిలదీశారు.
ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారని తాను ప్రధానిని అడుగుతున్నానని చెప్పారు. సామాజిక న్యాయం తీసుకువస్తానని ప్రధాని చెబుతుంటారని, మరోవైపు మీ నేతల మనస్తత్వం ఇలా ఉందని ఖర్గే ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న నేతలు ఇలా మాట్లాడటం తనను బాధించిందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
JMM MLA: హైదరాబాద్ వెళ్తున్నాం.. బిర్యానీ తినేందుకు.. మీడియాతో జార్ఖండ్ ఎమ్మెల్యే.. వీడియో