న్యూఢిల్లీ: మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అన్ని పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహరచనల్లో పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేహెచ్ రతన్కుమార్ సింగ్ను నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రతన్కుమార్ నియామకాన్ని ఖరారు చేశారని పార్టీ జాయింట్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. రతన్కుమార్ సింగ్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో మణిపూర్ కూడా ఒకటి. మణిపూర్తోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 7న యూపీలో తుది విడత పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.