లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి యూపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిని యూపీ పోలీసులు తమ అల్లుడిలా చూస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకుపోవడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ఇంతవరకూ బాధ్యులపై చర్యలు చేపట్టలేదని అన్నారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్కు యూపీ పోలీసులు సమన్లు జారీ చేసినా ఆయన పోలీసుల ఎదుట హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసు దర్యాప్తులో యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వోన్నత న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది.