న్యూఢిల్లీ : ఉదయ్పూర్లో టైలర్ కన్హయలాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. కన్హయలాల్ హత్య కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై సందేహం వ్యక్తం చేసింది. ఉదయపూర్ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా పేర్కొన్నారు.
బీజేపీ నేత, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా పాల్గొన్న కార్యక్రమాలకు రియాజ్ తరచూ హాజరయ్యేవాడని ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయని అన్నారు. బీజేపీ రాజస్ధాన్ మైనారిటీ విభాగం సమావేశాలకు రియాజ్ హాజరవుతుంటాడని, ఈ ఫోటోలు కూడా బహిర్గతమయ్యాయని చెప్పారు. రియాజ్ కాషాయ పార్టీ నేతలకు సన్నిహితుడే కాకుండా బీజేపీ సభ్యుడని ఖేరా పేర్కొన్నారు.
బీజేపీ నేతలు దేశమంతటా మతోన్మాదం విరజిమ్మేలా వ్యవహరిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ మౌనం దాల్చారని మండిపడ్డారు. ఉదయ్పూర్ హత్యను అవకాశంగా తీసుకుని బీజేపీ నేతలు దేశ వ్యాప్తంగా విభజన చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ ఖేరా ఆరోపించారు, ఉదయ్పూర్ హత్య కేసును హడావిడిగా కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కన్హయలాల్ హంతకుడు రియాజ్ బీజేపీ సభ్యుడని పవన్ ఖేరా విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ట్వీట్ చేశారు.