Rs 2000 Note | నమీబీయా చిరుత పులులతో ఫోటోలు దిగుతావు.. రుషికేశ్లో శివున్ని పూజిస్తూ పోజులిస్తావు.. ఆయోధ్యకు పోయినా.. సఫారీకెళ్లినా ఫోటో షూట్ తప్పనిసరే.. వందే భారత్ ట్రైన్కు జెండా ఊపుతూ.. రోజ్గార్ మేళాలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ కూడా ఫోటోలు కావాల్సిందే.. మరి రూ.2వేల నోటు రద్దు వంటి సంచలన నిర్ణయాన్ని మాత్రం చడీచప్పుడు లేకుండా ప్రకటిస్తారా? దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారు? దీని వెనకున్న మతలబు ఏమిటి?
( స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ): నల్లధనాన్ని అరికడుతామన్న నెపంతో గతంలో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు నిర్ణయంపట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.2వేల నోటు రద్దుపై కూడా అలాంటి పరిణామాలు పునరావృతం అవుతాయన్న భయమా? లేక తనకేమి సంబంధం లేదని ప్రధాని మోదీ తప్పించుకోవడమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.2వేల నోటు కాలం చెల్లిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చావు కబురు చల్లగా చెప్పడంపట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఆర్థిక రంగ నిపుణులు సైతం తప్పుబడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ చర్యపై తీవ్రంగా స్పందిస్తూ నిప్పులు చెరిగింది. ఇది కర్ణాటకలో ఓటమికి ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గతంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేకపోతున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం వెనకున్న ఔచిత్యం ఏమిటని ఆర్థిక రంగ నిపుణులు సైతం నిలదీస్తున్నారు. నల్లధనాన్ని అరికట్టడానికని గతంలో రూ.500, రూ.1000 పెద్ద నోట్లు రద్దు చేసినట్టు సమర్థించుకొని తిరిగి అంతకంటే పెద్దది రూ.2వేల నోటు తీసుక రావడం ఏమిటని మేధావులు, ఆర్థిక నిపుణులు, ప్రజలు తప్పుబడితే తమ నిర్ణయంలో తప్పేమి లేదన్నట్టు కేంద్రం సమర్థించుకుంది. మరి తాజాగా ఇప్పుడు అదే రూ.2వేల నోటును రద్దు చేయడమంటే అప్పుడు చేసింది తప్పని పరోక్షంగా ఇప్పుడు అంగీకరించినట్టే కదా?. దేశంలో నల్లధనం లేకుండా చేస్తామని, విదేశీ బ్యాంకులలో దాచుకున్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల జన్ధన్ ఖాతాలలో జమ చేస్తామని మాట నిలబెట్టుకోలేని కేంద్రం.. తిరిగి రూ.2వేల నోటు రద్దుకు ఏం సమాధానం చెబుతుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
రాజకీయ నిర్ణయమే…
రూ.2వేల నోట్ల ఉపసంహరణను వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు భావించాలని ఆర్ధిక రంగ నిపుణులు అనంత్ అభిప్రాయపడ్డారు. గతంలో కూడా పెద్ద నోట్ల రద్దు చేస్తూ హడావుడిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు బ్లాక్మనీ నియంత్రణ కోసమేనని ప్రకటించిందని గుర్తుచేశారు. ‘ఇప్పటికీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్ళీ రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటింటంలో అర్థం లేదు. కరెన్సీ నోట్లంటేనే ప్రజలకు అనుమానం కలిగే దుస్థితి కల్పించింది ప్రభుత్వం. రూ.500ల నోట్లు కూడా ఉంటాయో లేదోనని సగటు మనిషి భయపడుతున్నాడు. ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, కారణాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు. ఆర్బీఐ కూడా ఈ నిర్ణయంపై వివరంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
అసలు రూ.2వేల నోటు ఎందుకు తీసుకొచ్చారు? ముద్రణ, నగదు సరఫరాకు ఎంత ఖర్చయింది? ఆర్ధిక వ్యవస్థపై ఎంత భారం పడుతుంది? ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ‘దీన్ని రాజకీయ నిర్ణయమని ఎందుకనాల్సి వస్తోందంటే ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు డబ్బులు దాచుకున్నారేమోనని, బ్లాక్మనీ ఉందేమోననే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావించాలి. ఒకవేళ ప్రభుత్వం అలా అనుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటే డీమానిటైజేషన్ చర్యలు విఫలమైనట్టే. వాస్తవాన్ని అంగీకరించకుండా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటి నిర్ణయాలతో రిజర్వు బ్యాంకుపై ఉన్న గౌరవం, నమ్మకం తగ్గిపోతుంది. ఆర్బీఐ నిర్ణయంతో ఎక్కువ బాధపడేది సామాన్య ప్రజలే’ అన్నారు.
ఈ పరిణామం ఊహించిందే. నోట్ల రద్దు ఇప్పుడు సంపూర్ణమైంది. కేంద్రం గతంలో రూ.500, రూ.1000 నోట్లను తెలివి తక్కువగా రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సమర్థించుకొనేందుకు ఇప్పుడు రూ.2 వేల నోట్లను వెనక్కితీసుకుంటున్నది.
– పీ చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి
నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం వారికుందా? తుగ్లక్లు దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నారు. దీన్ని కూడా వాళ్లు ఆర్థిక వ్యవస్థకు మోదీ చేకూర్చిన బలంగా చిత్రీకరిస్తారు.
– బినోయ్ విశ్వం, సీపీఐ ఎంపీ
తాము గతంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందని కేంద్రం తాజా చర్య నిరూపించింది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠపై ఈ నిర్ణయం ప్రభావం చూపిస్తుంది.
– మహా వికాస్ అఘాడీ
ఇది స్వీయ ప్రకటిత విశ్వ గురు అనాలోచిత నిర్ణయ ఫలితం. ఆయన మొదట పని చేసేసి, తర్వాత ఆలోచిస్తారు.
– జైరామ్ రమేశ్
డీమోనిటైజేషన్ ఒక పెద్ద సాంగా కనిపిస్తున్నది. దీనిపై విచారించాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్ణయంతో దేశానికి ఎలా ప్రయోజనం పొందుతుందో చెప్పాలి. మోదీ సర్కార్ భారత దేశం ప్రజాస్వామ్య దేశమనే విషయాన్ని మరిచిపోతున్నది.
– దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత