(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అంటూ బీజేపీ సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతూనే ఉన్నది. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ – వన్ రేషన్’, ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్’, ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్’, ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే కాన్సెప్టులను తెరమీదకు తీసుకొచ్చింది కూడా. అయితే, పైకి సమైక్య భారతమే తమ లక్ష్యంగా బిల్డప్ ఇస్తున్న మోదీ పరివారం.. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో తీరుగా చూస్తూ పరోక్షంగా రాష్ర్టాల మధ్య వైరుధ్యాలకు కారణమవుతున్నది. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ర్టాలకు కన్న తల్లి ప్రేమను.. దేశప్రగతికి చోదకశక్తిగా మారిన దక్షిణాది రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది.
దేశ జనాభాలో దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాటా 19.5% కాగా.. ఉత్తరాది రాష్ర్టాలు యూపీ, బీహార్ జనాభా 26 శాతంగా ఉన్నది. అయితే, యూపీ, బీహార్తో పోలిస్తే జీడీపీలో దక్షిణాది వాటా 4.2 రెట్లు ఎక్కువ. భారత కార్పొరేట్-ఆదాయ పన్ను రాబడిలో దక్షిణాది వాటా పాతిక శాతం వరకు ఉంటుంది. ఇదే సమయంలో యూపీ, బీహార్ వాటా కేవలం 3 శాతమే. కేంద్రప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఆర్థిక సమన్యాయం తగినవిధంగా జరుగట్లేదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా దక్షిణాది రాష్ర్టాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. బకాయిల చెల్లింపులో కేంద్రం నాన్చివేత ధోరణే దీనికి కారణం. గడిచిన మూడేండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 2,433 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి ఉన్నది.
అధికారంలోకి వచ్చింది మొదలు దక్షిణాది రాష్ర్టాలపై ఉత్తరాది భాష, సంస్కృతులను రుద్దాలని బీజేపీ పలుమార్లు ప్రయత్నాలు చేసింది. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశమంతటికీ ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, ఆ భాషనే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు.. కాబట్టి, హిందీ మాత్రమే దేశం మొత్తాన్ని ఐక్యం చేయగలదని అన్నారు. హిందీని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దక్షిణాది రాష్ర్టాలతో పాటు యావత్తు జాతిజనులు భగ్గుమన్నారు.
2026లో కేంద్రం తీసుకురావాలనుకొంటున్న ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’తో దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగనున్నది. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 33% కాగా.. పార్లమెంట్లో మాత్రం వాటి ప్రాతినిధ్యం కేవలం 20 శాతానికి పరిమితం కానున్నది. జనాభా నియంత్రణలో గత కొన్నేండ్లుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్దశిక్షగా మారనున్నది. ఇదేసమయంలో జనాభా నియంత్రణను గాలికొదిలేసి ఎక్కువ జనాభాతో ఉన్న యూపీ, బీహార్కు కేంద్రం తాజాగా తీసుకురానున్న విధానం లబ్ధిచేకూర్చనున్నది. ఉదాహరణకు.. తెలంగాణలో 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. రాష్ట్రజనాభా 3.8 కోట్లు. జనాభాను లోక్సభ సీట్లతో గణిస్తే 22 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క. అదే బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర జనాభా 12.6 కోట్లు. లోక్సభ సీట్లు 40. అంటే, 32 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నట్టు అర్థమవుతున్నది. ఈ లెక్కన ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే లోక్సభలో బీహార్ ప్రాతినిధ్యం రెట్టింపవుతుంది. అంటే, జనాభా నియంత్రణను సరిగ్గా అమలుచేయని బీహార్కు రాజకీయ లబ్ధి చేకూరుతుంది. జాతీయ ప్రయోజనాలను ఆశించి జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగనున్నది.
తలసరి ఆదాయం
తలసరి ఆదాయం రూ. 3.12 లక్షలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. జాతీయ సగటు 1.7 లక్షల కంటే ఇది 84 శాతం ఎక్కువ. అంతేకాదు.. తలసరి ఆదాయంలో టాప్-5 స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాలే ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ర్టాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది.
జీఎస్డీపీ-రుణాల నిష్పత్తి
జీఎస్డీపీలో రుణాల వాటా ఎంత తక్కువగా ఉంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా అంత బలోపేతంగా ఉన్నట్టు. ఈ విషయంలో తెలంగాణే (25.3 శాతం) తొలిస్థానంలో ఉన్నది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (27.5 శాతం), తమిళనాడు (27.7 శాతం), ఏపీ (32.8 శాతం), కేరళ (37.2 శాతం) ఉన్నాయి.
వడ్డీల చెల్లింపు
తక్కువ వడ్డీలను చెల్లిస్తూ తెలంగాణ (11.3 శాతం) టాప్ ప్లేస్లో నిలవడమే కాదు.. మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (14.3 శాతం), ఏపీ (14.3 శాతం), కేరళ (18.8 శాతం), తమిళనాడు (21 శాతం) ఉన్నాయి. పన్ను రాబడులు, స్థూల ద్రవ్యలోటు సూచీల్లోనూ దేశంలోని అన్ని రాష్ర్టాలను తోసిరాజని దక్షిణాది ఐదు రాష్ర్టాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.