భోపాల్: సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఇస్తున్న కొత్త వెడ్డింగ్ కిట్(New Wedding Kits)లో కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్లోని జాబువా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి కన్యా వివాహం స్కీమ్లో భాగంగా జరిగిన సామూహిక వివాహాల్లో కిట్లను అందజేశారు. దాదాపు 296 జంటలకు అక్కడ పెళ్లి జరిగింది. అయితే ఆ జంటలకు ఇచ్చిన కిట్లలో కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు తేలింది. కిట్లలో ఉన్న మేకప్ బాక్సుల్లో ఈ ప్యాకెట్లను గుర్తించారు.
ఆరోగ్య శాఖ అధికారులు ఆ ప్యాకెట్లను కిట్లలో పెట్టి ఉంటారని జిల్లా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవగాహన కల్పించేందుకు ఆ కిట్లలో కండోమ్లను పెట్టి ఉంటారని ఆయన అన్నారు.
ఇటీవల కన్యా వివాహ స్కీమ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలను నిర్వహించారు. దిండోరీలో జరిగిన సామూహిక వివాహ వేడుక సమయంలో వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేపట్టారు. అయితే ఆ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సాధారణ వయసును తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తుంటామని, ఆ వ్యక్తుల్లో రక్తహీనత ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్ష చేపడుతుంటామని దిండోరి మెడికల్ ఆఫీసర్ తెలిపారు.