ప్రయాణంలో చదవడం, చదవకపోవడం, నీళ్లు తాగడం, తాగకపోవడం ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. పైగా ప్రయాణికులకు నచ్చిన దినపత్రిక, అభిరుచి ఉన్న పత్రికను చదివే ఛాన్స్ కూడా ప్రయాణికులకు ఉంటుంది. ప్రయాణికులను కాదని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రయాణికులే బాస్లు. కానీ రైల్వే శాఖ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రైళ్లో ఎక్కిన ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించిన న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ తీసుకోవాలి. దీని కోసం కచ్చితంగా 20 రూపాయలు కట్టాల్సిందేనని తేల్చి చెబుతోంది. ఇలాంటి ఘటనే ఒకటి ఓ ప్రయాణికుడికి ఎదురైంది. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మండిపడడమే కాకుండా ఏకంగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు ఫిర్యాదు కూడా చేసేశారు.
ఏం జరిగిందంటే..
మూర్తి అనే ప్రయాణికుడు చెన్నై నుంచి మథురైకి తేజస్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించాడు. ఆయన ఎక్కే సమయానికి ఆయనకు కేటాయించిన సీట్లో ఓ వార్త పత్రిక, వాటర్ బాటల్ ఉంది. ఈయన ఒక్కరి సీట్లోనే కాదు.. తోటి ప్రయాణికుల సీట్లలోనూ సేమ్ టు సేమ్. ఆ తర్వాత కొద్ది సేపటికే టిక్కెట్ కలెక్టర్ వచ్చి, 20 రూపాయలు ఇవ్వాల్సిందిగా మూర్తి అనే ప్రయాణికుడ్ని డిమాండ్ చేశారు. 20 రూపాయలు చెల్లించడానికి మూర్తి నిరాకరించారు. ఇతరులు కూడా కడతారని ఆ టీటీఈ పేర్కొన్నారు. అయినా కట్టనని మూర్తి తెగేసి చెప్పేశారు. దీంతో ఆ టీటీఈ పక్క సీట్లోకి వెళ్లిపోయాడు. దీంతో మూర్తి అనే ప్రయాణికుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను ఆపేయాలని తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
స్పందించిన ఐఆర్సీటీటసీ
ఈ రగడ ఒక్కసారిగా ముదరడంతో ఐఆర్సీటీసీ స్పందించింది. ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ గోల్డ్స్టోన్ డేవిడ్ స్పందించారు. రైల్వే బోర్డు పాలసీ ప్రకారం తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారికి న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ ఇవ్వాలని నిర్ణయించాం. అయితే తాము నిర్ణయించిన దిన పత్రికను మాత్రమే చదవాలన్న నిబంధన ఏమీ లేదు. అది వారి వారి వ్యక్తిగతం. ఇతర దినపత్రికలను కూడా ఎంచుకునే స్వేచ్ఛ ప్రయాణికులకు ఉంది అని డేవిడ్ పేర్కొన్నారు.