కోల్కతా, మే 6: దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని శనివారం ఆయన అన్నారు. దేశంలోని ప్రతిఒక్కరూ దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని కోరారు. సినిమా ఉద్దేశం స్పష్టంగా ఉందన్నారు.
దేశంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా మాదిరిగానే ఇది కూడా బీజేపీ కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. కేరళ స్టోరీ గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. సీపీఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలతో చర్చించి నిరసనలు కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.