న్యూఢిల్లీ: మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు సిలిండర్ వినియోగదారులకు (Gas Cylinder Price) గుడ్న్యూస్ చెప్పాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరను స్వల్పంగా తగ్గించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయని పేర్కొన్నాయి.
దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,797కు తగ్గింది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. కాగా, గత డిసెంబర్లో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.62 పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఈ ఏడాది జనవరిలో తగ్గాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.14.50 నుంచి రూ.16 వరకు చమురు కంపెనీలు తగ్గించాయి.