న్యూఢిల్లీ: ఇటలీ నావికుడైన క్రిస్టఫర్ కొలంబస్ 1492వ సంవత్సరంలో అమెరికాను కనుగొనెను.. చిన్నప్పటి నుంచి బడిలో చదివి చదివి మన మెదళ్లలో నాటుకుపోయిన విషయాల్లో ఇదొకటి. కానీ ఇది తప్పని తేలింది. కొలంబస్ కంటే ముందే ఐరోపా నావికులు ఉత్తర అమెరికాను చేరుకొన్నారని, అక్కడ కొంతకాలం జీవనం సాగించారని శాస్త్రీయంగా స్పష్టమైంది. ఇప్పటికి వెయ్యేండ్ల పూర్వం.. అంటే 1021లోనే ఐరోపా నావికులు తొలిసారి ఉత్తర అమెరికా గడ్డపై అడుగుపెట్టారని గ్రోనింజెన్ వర్సిటీ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రేడియో కార్బన్ విధానం సహాయంతో నిర్ధారించింది. అంటే కొలంబస్ కంటే దాదాపు ఐదు వందల ఏండ్ల క్రితమే ఐరోపా నావికులు ఉత్తర అమెరికాను కనుగొన్నారన్న మాట. వారు పశ్చిమం వైపు ప్రయాణిస్తూ ఐస్ల్యాండ్, గ్రీన్ల్యాండ్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొంటూ ముందుకు కదిలారని, ఇలా వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ప్రస్తుత కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్లో ఉన్న లా ఆన్సీ ఆక్స్ మీడోస్ ప్రాంతాన్ని చేరుకొన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.
వెయ్యేండ్ల క్రితమే..
వెయ్యేండ్ల క్రితం ఉత్తర అమెరికా చేరుకొన్న ఐరోపా నావికులు అక్కడ అడవులను ధ్వంసం చేసి ఆవాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడి నుంచి దక్షిణం వైపునకు కదిలారు. లా ఆక్సీ మీడోస్ను యూరోపియన్ల తొలి స్థావరంగా 1960లో గుర్తించారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో యూరోపియన్లు వాడిన కర్ర ముక్కలు, రాతి విగ్రహాలు, ఎముకలు, లోహాలు దొరికాయి. వాటిలో పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేర్వేరు చెట్ల నుంచి లభించిన మూడు కర్ర ముక్కలపై రేడియో కార్బన్ విధానంలో అధ్యయనం నిర్వహించగా అవి వెయ్యేండ్ల కింద నరికినవని తేలింది. అయితే ఎంత మంది నావికులు అక్కడి వెళ్లారు.. ఎంత కాలం ఉన్నారు.. ఎప్పుడు తిరిగి వచ్చారు.. అన్న వివరాలు తెలుసుకొనేందుకు ఇంకా పరిశోధనలు జరుగాల్సి ఉంది. లా ఆక్సీ మీడోస్ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
లీఫ్ ఎరిక్సన్ మొదటి వ్యక్తి?
కొలంబస్ కంటే ముందే ఐరోపా నావికులు ఉత్తర అమెరికాకు వెళ్లారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్నది. కొలంబస్ కంటే ముందు 500 ఏండ్ల క్రితమే ఐస్ల్యాండ్కు చెందిన లీఫ్ ఎరిక్సన్ అమెరికాపై అడుగుపెట్టాడని, అతని పేరు మీదుగానే లా ఆక్స్ మీడోస్ పేరు వచ్చిందన్న కథనాలు ఉన్నాయి. అయితే అందుకు ఆధారాల్లేవు.