Supreme Court Collegium | ఒక రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి, మరో న్యాయమూర్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్ కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి సిపారసులు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుధాంశు ధులియా, గుజరాత్ హైకోర్టు జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పార్డివాలాలను సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేయాలని కొలీజియం పేర్కొన్నట్లు సమాచారం.
జస్టిస్ సుధాంశు ధులియా 1986లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్లో చేరారు. తదుపరి 2000లో ఉత్తరాఖండ్ ఏర్పాటయ్యాక సొంత రాష్ట్రానికి వెళ్లారు. ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్గా నిలిచిన జస్టిస్ ధులియా తదుపరి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా సేవలందించారు. 2008 నవంబర్లో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అటుపై అసోం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పార్దివాలా 1990లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 2002లో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరి 17న గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలీజియంకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షత వహిస్తుండగా జస్టిస్లు యూయూ లలిత్, ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నారు.
సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 మంది. అయితే ప్రస్తుతం 32 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరిని నియమించాల్సి ఉంది. త్వరలో జస్టిస్లు వినీత్ శరణ్, నాగేశ్వరరావులు రిటైర్ కానుండటంతో మరో ఇద్దరు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ అవుతాయి. చీఫ్ జ్టిస్ ఎన్వీ రమణతోపాటు మరో నలుగురు జడ్జిలు ఈ ఏడాది చివరిలో రిటైరవుతారు.