హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ):కరోనా వచ్చి పోతున్నది.. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఒంట్లో సత్తువతగ్గి హార్ట్బీట్రేట్ తగ్గటం, బీపీ పెరగటం, కండ్లు తిరగటం, శారీరక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలను పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్(కరోనా చికిత్స అనంతరం బయటపడే లక్షణాలు) అంటారని, వీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని స్టార్ హాస్పిటల్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గూడపాటి సుబ్బయ్య చౌదరి సూచించారు. కరోనా చికిత్స అనంతరం వచ్చే అనారోగ్య సమస్యలు, అధిగమించేందుకు బలవర్థక ఆహారం తీసుకోవాలని, రోజూ వ్యాయామం చేయాలని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న అనుమాల నివృత్తి చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సుబ్బయ్యచౌదరి పలువిషయాలు వెల్లడించారు.
పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ అంటే?
కరోనా సోకి చికిత్స ద్వారా కోలుకున్న వారిలో అనేక అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. దాన్నే వైద్య పరిభాషలో పోస్ట్కొవిడ్ సిండ్రోమ్ అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గాక కొన్ని నెలలపాటు కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, నీరసం ఉంటున్నది. చాలా మందిలో హార్ట్బీట్రేట్ తగ్గటం, బీపీ పెరగటం, లేచి నిల్చుంటే కండ్లు తిరగటం, శారీరక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మతిమరుపు, నరాల బలహీనత, ఫిట్స్, రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్నవాళ్లలో హార్ట్ఎటాక్, పక్షవాతం వంటివి, నిద్ర పెరగటం, తగ్గటం, మూడ్ మారటం, పొడిదగ్గు సమస్యలు బయటపడుతున్నాయి. చిన్నపిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫమ్లేటరీ సిండ్రోమ్, హై ఫీవర్, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు చూస్తున్నాం.
ఈ అనారోగ్య సమస్యలకు కారణాలేంటి?
పోస్ట్ కొవిడ్ చాలామందిని భయపెడుతున్నది. రోజువారి వాకింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. పోస్ట్కోవిడ్ సమస్యలు ఎవరిలో ఎలా ఉంటాయో, ఎందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయో తెలిసే సరైన ఆధారాలు లేవు. కరోనా బారినపడ్డ వారిలో ఇమ్యూనిటీ తగ్గటం, శారీరక పరిస్థితులను బట్టి చికిత్స అనంతరం పలు అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. కరోనా ప్రభావం ఊపిరితిత్తులపైనే కాకుండా ఇతర అవయవాలపైనా ప్రభావం చూపుతున్నది. కరోనా సోకిన వారిలో 3 వారాలకే ఇల్నెస్ తగ్గుతుందనే భావన నుంచి బయట పడాలి. ఎప్పటికప్పుడు మన శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి.
ఎవరిలో పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ కనిపిస్తున్నది?
కరోనా, స్టెరాయిడ్స్, భయం వంటివాటి వల్ల పోస్ట్ కొవిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని కచ్చితంగా చెప్పలేం. హోం ఐసోలేషన్లో ఉంటూ కోలుకొన్న కొందరిలోనూ ఇలాంటి సమస్యలు బయటపడుతున్నాయి. వీటిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ కాలం దవాఖానలో చిక్సిత పొంది, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిలో మాత్రం పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తున్నది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు మనపై ప్రభావం చూపకుండా ఉండాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి.
ఈ సమస్యను అధిగమించడం ఎలా?
బలవర్థక ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయా మం చేయాలి. ప్రారంభంలో ఇబ్బంది కలగొచ్చు.. కొత్తగా నడక, ఇతర వ్యాయామాలు చేసేటపుడు ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాలి. శరీరంలో ఐరన్, విటమిన్స్ తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ప్రధానంగా నిద్ర సమస్య ఉన్నవారు ఉదయం వేళల్లో నడక, ఇతర వ్యాయామ పద్ధతులను కొనసాగించాలి.
నరాలకు సంబంధించి ఇబ్బందులున్నాయా?
కరోనా సోకిన వారు, చికిత్సద్వారా కోలుకున్న వారిలోనూ నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటున్నాయి. ఒక్కోసారి తలను గోడకేసి కొట్టుకోవాలన్నంత తలనొప్పి బాధపెడుతుంది. కొందరిలో ఫిట్స్ ఒకవైపు లేదా రెండు వైపులా రావచ్చు. నరాలపై చూపే ప్రభావం కారణంగా కొందరిలో నిద్ర లేకపోవటం, మరికొందరిలో మగతగా (ఎప్పుడు నిద్రమత్తులో)ఉండటం, బ్రెయిన్స్ట్రోక్, పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కరోనా చికిత్స సమయంలో గానీ, కోలుకొని ఇంటికి వెళ్లిన కొందరిలో కనిపిస్తున్నట్టు ఆధారాలున్నాయి. మెదడులో రక్త ప్రసరణలో జరిగిన మార్పుల వల్ల కోపం, దిగులు, మతిమరుపు, నిద్ర లేకపోవటం, విచక్షణ కోల్పోవటం (సైకోసిస్) వంటి సమస్యలు కూడా బయటపడుతున్నాయి. ఇది పెద్ద వయసువారిలోనే కాకుండా 30-40 ఏండ్లవారిలోనూ కనిపిస్తున్నది.