కోయింబత్తూర్: అడవుల పరిసర గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు ప్రవేశించడం సర్వసాధారణమైంది. చిరుతలు, ఎలుగులు, పెద్ద పులులు, ఏనుగులు ఇలా ఎప్పుడూ ఏవో జంతువులు పరిసర గ్రామాల్లో జనవాసాల్లో దూరుతున్నాయి. పెద్ద పులులు, చిరుతల దాడిలో ఇప్పటికే చాలా సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడప్పుడు ఎలుగులు దాడులు చేసి ప్రజల ప్రాణాలు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఏనుగులు గ్రామాల్లో చొరబడి ప్రజల ప్రాణాలు తీయడం, పంటలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ జిల్లాలోని కడలూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ గ్రామంలో చొరబడింది.
వచ్చీరావడంతోనే ఏనుగులు జనావాసాలపై దాడి చేయడంతో 50కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. డప్పులు కొడుతూ, బాంబులు కాలుస్తూ స్థానికులు ఆ ఏనుగుల మందను వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. చివరి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఏనుగుల మందను అడవి వైపు మళ్లించారు.