Coimbatore Blast: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి పండుగ వేళ ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే పేలుడు ప్రదేశంలో లభించిన సీసీ ఫుటేజీ పలు సందేహాలకు తావిస్తున్నది.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు నగరం ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మొబిన్ (25) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం స్థానిక సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు.. మొబిన్ ఇంటి నుంచి మొబిన్తోపాటు మరో నలుగురు వ్యక్తులు ఓ బస్తాను బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి.
తర్వాత వాళ్లు ఆ బస్తాను ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కారులో పెట్టడం, అనంతరం ఆ కారులో పేలుడు సంభవించడం జరిగిందని పోలీసులు చెప్పారు. మొబిన్తోపాటు ఉన్న ఆ నలుగురు ఎవరు అనే కోణంలో కూడా తమ దర్యాప్తు కొనసాగతున్నదన్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు పేర్కొన్నారు.
కాగా, ఈ పేలుడులో మరణించిన మొబిన్ను 2019లోనే ఎన్ఐఏ విచారించినట్లు పోలీసులు ఎంక్వయిరీలో తేలింది. జహ్రాన్ హషీమ్కు సంబంధించిన రాడికల్ నెట్వర్క్తో సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ అతన్ని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం మొబిన్ ఇంటిలో పోలీసులు సోదా చేయగా పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ లాంటి నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలు లభించాయి.
ఇక ఈ ఘటనలో పేలిన కారు వివరాల గురించి పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు ఇప్పటివరకు 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మొబిన్ ఇంటి దగ్గర కనిపించిన నలుగురు కారులో పేలుడు సమయంలో అక్కడ ఎందుకు లేరు..? పేలుడు గురించి ముందే గ్రహించి అక్కడి నుంచి తప్పించుకున్నారా..? అనే యాంగిల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, పేలుడు ఘటనపై క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడుకు గల కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఢిల్లీలోని ప్రత్యేక ల్యాబ్కు శిథిలాలను తరలించారు. మొబిన్ ఫోన్ కాల్స్ ఆధారంగా అతనితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా..? ప్లాన్తో జరిగిందా..? అనే కోణంలో కూడా వివరాలు రాబడుతున్నారు. పేలుడు నేపథ్యంలో కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.