హైదరాబాద్, మే 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా పుట్టుకొచ్చిన వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత శనివారం ప్రారంభమైన ఈ పార్టీ పేజీలను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం ఈ పార్టీని 1.6 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నట్టు చెప్పుకొనే జాతీయ పార్టీలకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్లు లేకపోవడం గమనార్హం. 141 ఏండ్ల కిందట ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి ఇన్స్టాలో 1.33 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, 46 ఏండ్ల కిందట ఏర్పడిన బీజేపీకి 88 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ప్రారంభించిన ఐదు రోజుల్లోనే సీజేపీ ఇన్స్టా పేజీకి 1.6 కోట్ల మంది ఫాలోవర్లు రావడం గమనార్హం.
సోషల్మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న సీజేపీ ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపేశారు. చట్టపరమైన డిమాండ్ పేరిట ఖాతాను నిలిపివేశారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపేసిన గంటల వ్యవధిలోనే ఆ డిజిటల్ అవుట్ఫిట్ నుంచి కొత్త ఖాతా క్రియేట్ అయ్యింది. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరిట ప్రారంభమైన ఈ ఖాతాను నిమిషాల వ్యవధిలో వేలాది మంది ఫాలో కావడం గమనార్హం. ‘నిన్న మా ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఖాతాను నిలిపేశారు. ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని మేము ముందే ఊహించాం. అందుకే, ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే ఖాతాతో మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ప్రస్తుత పరిణామాలను న్యాయపరంగా పరిష్కరించుకొంటాం’ అని అభిజీత్ వెల్లడించారు.
సీజేపీ పేరుపై హక్కులను కోరుతూ మూడు వేర్వేరు ట్రేడ్మార్క్ దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే, సీజేపీని స్థాపించిన అభిజీత్ కాకుండా వేర్వేరు వ్యక్తులు ఈ దరఖాస్తులను దాఖలు చేయడం గమనార్హం. అజీమ్ అడంభాయ్ జామ్, అఖండ్ స్వరూప్ అనే వ్యక్తులతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ అనే యాజమాన్య సంస్థ వేర్వేరుగా సీజేపీ పేరు కోసం దరఖాస్తులు చేసినట్టు సమాచారం.