లక్నో: యూనివర్సిటీ హాస్టల్ ఫుడ్లో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. లక్నో యూనివర్సిటీ (Lucknow University) కొత్త క్యాంపస్లో లా విద్యార్థుల హాస్టల్స్ ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒక హాస్టల్ క్యాంటీన్లో సర్వ్ చేసిన భోజనంలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. గరెటెతో తీసిన బొద్దింకను కొందరు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీశారు. హాస్టల్ వార్డెన్కు దీని గురించి ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ రాయ్, విద్యార్థుల సంక్షేమ డీన్కు ట్యాగ్ చేశారు.
కాగా, ఆహారంలో బొద్దింకలు, పురుగుల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని పలువురు విద్యార్థులు విమర్శించారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయని, ఆహారం నాణ్యత లోపిస్తున్నదని ఆరోపించారు. మరోవైపు హాస్టల్ చీఫ్ దీనిపై స్పందించారు. మెస్ ఓనర్ను హెచ్చరించినట్లు తెలిపారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.