న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. పంజాబ్తో పాటు ఉత్తరాదిన పలు రాష్ర్టాల్లో ఇప్పటికే విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. బొగ్గు కొరత కారణంగా తాజాగా 20 థర్మల్ పవర్ స్టేషన్లను అధికారులు మూసివేశారు. మూసివేసిన ప్లాంట్ల జాబితాలో అత్యధికంగా మహారాష్ట్రలో 13 ఉండగా, కేరళలో 4, పంజాబ్లో మూడు ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు, రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని, వెంటనే బొగ్గును సరఫరా చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం తాజా పరిస్థితికి అద్దం పడుతున్నది. బొగ్గు సంక్షోభం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ను కూడా వేధిస్తున్నది.
కోతలు అనివార్యం.. సహకరించండి!
‘రాష్ట్రంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో విద్యుత్తు కోతలు అనివార్యం కావొచ్చు. కాబట్టి, ప్రజలు అనవసరంగా విద్యుత్తును వృథా చేయకుండా సహకరించగలరు’ అని అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్థానిక వార్త పత్రికల్లో ప్రకటనలను ఇచ్చింది.
అమిత్ షా అత్యవసర భేటీ
దేశంలో బొగ్గు కొరత, కరెంటు కోతలు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, బొగ్గు కొరత, విద్యుత్తు సంక్షోభంపై కొందరు అనవసరంగా భయాలను సృష్టిస్తున్నారని కేంద్రప్రభుత్వ పెద్దలు పైకి చెబుతున్నప్పటికీ.. తమ తప్పిదంపై అంతర్గతంగా పెద్దఎత్తున చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో.. కేంద్రహోంమంత్రి అమిత్ షా సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం దేశంలో ఉన్న బొగ్గు నిల్వలు, విద్యుత్తు డిమాండ్ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఎన్టీపీసీకి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు, విద్యుత్తును సరఫరా చేసే డిస్కంలు.. విద్యుత్తు నష్టాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అధిక ధరలకు కొంటున్నాం: ఆప్
దేశవ్యాప్తంగా విద్యుత్తు ప్లాంట్లలో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతలతో రాజధానిలో అత్యవసర స్థితి రాకుండా ఉండేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. నగరానికి విద్యుత్తు సరఫరాను 50 శాతం తగ్గిస్తూ ఎన్టీపీసీ నిర్ణయం తీసుకున్నదని ఢిల్లీ విద్యుత్తు మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. దీంతో ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తున్నదన్నారు. సంక్షోభ నివారణకు కేంద్రం వీలైనంత తొందరగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.