Vijay | నటుడు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన.. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు, డ్రగ్స్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు వంటి కీలక నిర్ణయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, బస్టాండ్లు వంటి ప్రజా రద్దీ ప్రాంతాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం, సామాజిక భద్రత, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు కనీసం 500 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉండాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న అన్ని షాపులను వెంటనే మూసివేయాలని లేదా ఇతర ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా దుకాణాలు స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, బస్టాండ్లకు అత్యంత సమీపంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ దుకాణాల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
విద్యాసంస్థల సమీపంలో మద్యం షాపులు ఉండటం వల్ల విద్యార్థులు చెడు అలవాట్లకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే బస్టాండ్ల వద్ద మద్యం దుకాణాల కారణంగా మహిళా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మద్యం మత్తులో కొందరు చేసే ఆగడాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. “ఆదాయం కంటే ప్రజల భద్రత, భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు దొరికాడు” అంటూ పలువురు విజయ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.