చెన్నై, సెప్టెంబర్ 3: సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. దీనిని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. పూర్తిగా రూపుమాపాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని అసోసియేషన్ నిర్ణయించటాన్ని ఆయన సమర్థించారు.
సనాతన భావజాలంలో భాగంగానే కేంద్రం ‘నీట్’ను తీసుకొచ్చిందన్నారు. ‘సనాతనం అన్నది సంస్కృత పదం. సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకం తప్ప మరోటి కాదు. కులం పేరుతో మనుషుల్ని విడదీసింది’ అని ఆయన విమర్శించారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ నాయకుడు, దివంగత నేత కరుణానిధి ద్రవిడ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కచోటకు తీసుకొచ్చారని వివరించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. డీఎంకేపై బీజేపీ, హిందూ సంఘాలు విరుచుకుపడ్డాయి. ఉదయనిధిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.