ముంబై: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందే రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించాలని పవార్ సూచించారు.
రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, మహారాష్ట్రకు చెందిన ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటై, సరిహద్దు వివాదంపై ఒకే స్టాండ్ వినిపించాలని శరద్ పవార్ కోరారు. సమస్యపై కర్ణాటక సీఎంతో సీఎం షిండే చర్చించినప్పటికీ ఆయన (కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై) నుంచి ఎలాంటి సానుకూలత కనిపించలేదన్నారు. సమస్యను తప్పుదోవ పట్టించవద్దని, ఎవరూ తమ (మహారాష్ట్ర ప్రజలు) సహనాన్ని పరీక్షించకూడదని శరద్ పవార్ బాధ్యులను సున్నితంగా హెచ్చరించారు.