CM Eknath Shinde | ముంబై, సెప్టెంబర్ 13: మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర బీజేపీ-శివసేన(షిండే) సర్కార్ నిర్లక్ష్యపు వైఖరి బయటపడింది. దీనికి సంబంధించి ఏక్నాథ్ ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ వీడియో తాజాగా వైరల్గా మారింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరాఠా కోటాపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్కు వచ్చే క్రమంలో.. ఫడ్నవీస్, అజిత్ పవార్లతో సీఎం షిండే పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘మనం మాట్లాడి, వెళ్లిపోవచ్చు.. అంతేకదా!’ అని వ్యాఖ్యానించారు. దీనికి అజిత్ పవార్ స్పందిస్తూ ‘అవును అంతే’ అని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో మైక్రోఫోన్ ఆన్లో ఉన్నదని అలర్ట్ చేస్తూ షిండే చెవిలో ఫడ్నవీస్ గుసగుసలాడారు.
సీఎం, డిప్యూటీ సీఎంల తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారి మాటలు తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఎట్టకేలకు వారి మనసులో ఏమున్నదో వారి నోటి నుంచి బయటకు వచ్చిందని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే పేర్కొన్నారు. శివసేన(యూబీటీ) నేత, ఎంపీ ఓంరాజే నింబాల్కర్ మాట్లాడుతూ ఓవైపు రిజర్వేషన్ల కోసం మరాఠాలు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, ప్రభుత్వ తీరు దారుణంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గులేని తనానికి ముఖం అంటూ ఉంటే, అది ఈ ప్రభుత్వమే అవుతుంది’ అంటూ మరో ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాదెట్టివార్ అన్నారు.