డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి అధికార బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ అధిష్ఠానం సూచనల మేరకు ఓ నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 10వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా ఉచితంగా టాబ్స్ అందజేయనున్నారు.
పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ మొత్తం 100 మంది బాలికలకు ఉచిత ట్యాబ్స్ను అందజేశారు. అయితే, మిగతా లబ్ధిదారులందరి ఖాతాల్లో ట్యాబ్స్ కొనుగోలు కోసం రూ.12,000 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకానికి 2.65 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నారని, వారిలో 1.59 లక్షల మంది ఖాతాల్లో ఇప్పటికే రూ.12,000 చొప్పున జమచేశామని చెప్పారు.