తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్ తన క్యాబినెట్ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సుపై ఇటీవల షూ దాడి(Shoe Hurling Incident) జరిగింది. నవ కేరళ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం విజయన్ బస్సుపై కేఎస్యూ కార్యకర్తలు షూ విసిరారు. ఆ కేసులో ఇప్పటికే నలుగురు కార్యకర్తల్ని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మలయాళం ఛానల్ 24కు చెందిన మహిళ జర్నలిస్టును కూడా అదుపులోకి తీసుకున్నారు. రిపోర్టర్ వినీతపై కూడా కురుపంపాడి పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్ను జర్నలిస్టులు ప్రశ్నించారు. రిపోర్టర్ వినీతను ఎందుకు అరెస్టు చేశారని అడగ్గా.. పోలీసులు చేపట్టిన చర్యను సమర్థిస్తున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే ఆ జర్నలిస్టును అదుపులోకి తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. స్వరం ఉంది కాబట్టి ఎదుటివారిని భయపెట్టాలన్న ఆలోచన సరికాదు అని సీఎం తెలిపారు. షూ విసిరిన కేసులో మహిళ జర్నలిస్టును పోలీసులు విచారిస్తారని సీఎం చెప్పారు.