చెన్నై : తమిళనాడులో అమూల్ పాల సేకరణపై అభ్యంతరం తెలుపుతూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్ర సొంత బ్రాండ్ అయిన ఆవిన్ సహకార సంఘం పరిధిలో అమూల్ పాలను సేకరించడం ఉల్లంఘణ కిందకే వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాలు సేకరించకుండా ఆదేశించాలంటూ అమిత్ షాను స్టాలిన్ కోరారు. సహకార సంఘాలు సహకరించుకుంటూనే అభివృద్ధి చెందడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమని పేర్కొన్నారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తూ పాలను అమూల్ సేకరించడం శ్వేత విప్లవ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అమూల్ రాకతో రాష్ట్రంలో అనారోగ్యకర పోటీ ఏర్పడుతుందన్నారు. కృష్ణగిరి జిల్లాలో శీతలీకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ను నెలకొల్పి… కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూర్, రాణిపేట్, తిరుపత్తూర్, కాంచీపురం, తిరువల్లూర్ జిల్లాల్లో పాలను సేకరించనున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.